అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో "న్యూ వరల్డ్ స్క్రూవార్మ్" (New World Screwworm) అనే ప్రమాదకర పరాన్నజీవి పురుగు కేసు గుర్తించబడింది. ఈ పురుగు లార్వా (మ్యాగెట్స్) సాధారణంగా జంతువుల శరీరంపై ఉన్న గాయాల ద్వారా లోపలికి ప్రవేశించి సజీవ మాంసాన్ని తింటూ పెరుగుతాయి.
ఈ పరాన్నజీవులు గాయాన్ని మరింత తీవ్రమయ్యేలా చేసి, చికిత్స అందించకపోతే ఆ జంతువు మరణించే పరిస్థితి ఏర్పడుతుంది. పశువులు, గొర్రెలు, మేకలు, అడవి జంతువులు ఎక్కువగా దీని బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా వ్యవసాయ శాఖ (USDA) ఈ ఘటనపై అప్రమత్తమై పర్యవేక్షణను పెంచింది. వ్యాధి మరింత వ్యాపించకుండా చర్యలు చేపడుతోంది. అరుదైన సందర్భాల్లో ఈ పురుగు మనుషుల గాయాల్లో కూడా ప్రవేశించి ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పశువుల యజమానులు తమ జంతువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గాయాలు కనిపిస్తే వెంటనే వైద్య చికిత్స అందించాలని అధికారులు సూచించారు.